Saturday, July 27, 2024
Homeదేశంకేరళభక్త జనసంద్రం గా మారిన శబరిమల 

భక్త జనసంద్రం గా మారిన శబరిమల 

భక్త జనసంద్రం గా మారిన శబరిమల 

శరనుఘోషతో మారుమ్రోగుతున్న శబరి కొండలు

తిరువనంతపురం, డిసెంబరు 10(కలం శ్రీ న్యూస్): పవిత్ర శబరిమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యక్షేత్రంలో అత్యంత రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి క్యూలైన్లలో 18 గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. శుక్రవారం నుంచి రోజుకు లక్షమంది వస్తున్నట్లు అంచనా. పోలీసులు, దేవస్థానం సిబ్బంది శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా వేలాదిగా పోటెత్తుతున్న భక్తులను నియంత్రించడం మహా కష్టంగా మారింది. శనివారం రాత్రి దాక కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. గంటల కొద్దీ నిరీక్షణతో సహనం కోల్పోయిన కొందరు క్యూలైన్లను బ్రేక్‌ చేసి.. బారికేడ్లు దూకి పథినెట్టంబడిని చేరుకుంటున్నారు. ఇలాగైతే లాభం లేదని.. ఆన్‌లైన్‌ క్యూ బుకింగ్‌ను 90 వేల నుంచి 80 వేలకు కుదించారు. ప్రస్తుతం భక్తుల వరుస సన్నిధానం నుంచి శబరి పీఠం వరకు ఉంది. దీంతో దేవస్థానం వర్గాలు ఇకపై వస్తున్న భక్తులను పంబా వద్దనే నిలిపివేస్తున్నారు. సన్నిధానం, పంబా వద్ద అదనపు పోలీసుల బలగాలను మోహరించారు. ఇక ఎరుమేలి, పంబా, నిలక్కల్‌, ఎలవుంకల్‌ ప్రాంతాల్లో వీరి వాహనాలు బారులు తీరాయి. కాగా, శని,ఆదివారాలు సెలవు రోజులు కావడంతోనే రద్దీ ఏర్పడిందని.. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ దేవాదాయ మంత్రి కె.రాధాకృష్ణన్‌ ఆదేశించారు.

దర్శనం వేళలు మార్పు..

భక్తుల తాకిడికి అష్టాభిషేకం, పుష్పాభిషేకాలను రోజుకు 15కు పరిమితం చేసినట్లు వివరించింది. అనూహ్య రద్దీ కారణంగా.. అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉన్న దర్శన వేళలను గంట పెంచింది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శన అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న వారికి మంచినీరు, బిస్కెట్లు అందజేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!