Saturday, July 27, 2024
Homeతెలంగాణనేను పని చేయని ఊరు లేదు...నా సాయం అందని కుటుంబం లేదు

నేను పని చేయని ఊరు లేదు…నా సాయం అందని కుటుంబం లేదు

నేను పని చేయని ఊరు లేదు…నా సాయం అందని కుటుంబం లేదు

ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్23(కలం శ్రీ న్యూస్):40ఏండ్ల మీ కలలకు సాకారం చేసిన చరిత్ర నాదేనని, ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన అనేక అభివృధ్ది పనులను నాలుగేండ్లలో చేసి చూపించానని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం మంథని మండలం విలోచవరం, పోతారం,ఉప్పట్ల గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో పాలకులు ప్రజల కష్టాలు, కన్నీళ్లు పట్టించుకోలేదన్నారు. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి అభివృధ్ది పనులు చేశామని తెలిపారు. అయితే గ్రామాలు ప్రగతి బాటలో పయనించాలని ఆలోచన చేస్తూ, ఇక్కడి స్థానిక నాయకులను ప్రోత్సహిస్తే కోట్లాది రూపాయలు సంపాదించుకుని పార్టీలు మారుతున్నారని అన్నారు. స్తానికంగా ప్రజల నుంచి తిరస్కరించబడి, రాజకీయ భవిష్యత్‌ లేకుంటే అన్నా నీవే దిక్కు అంటూ వస్తే నమ్మి అన్నం పెడితే సున్నం పెట్టాడని ఆయన వివరించారు. బీసీలు,ఎస్సీలు ఎదుగాలని, సమాజంలో మంచి గౌరవించబడాలని ఆలోచన చేసి పదవులు ఇస్తే పైసల కోసం మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారడానికి ఒక సమయం, ఒక లెక్క ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం నాయకులు అమ్ముడు పోయి ఊర్లకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని అన్నారు. విలోచవరం గ్రామానికి చెందిన ఓ నాయకుడిని ఆదరించి అన్నం పెడితే ఈ ఊరిలో అభివృధ్దిని అడ్డుకున్నాడని, కేవలం పైసల కోసం ఇక్కడి సర్పంచ్‌ను సైతం ఇబ్బంది పెట్టాడని అన్నారు. గొప్ప పదవులు వస్తే ఊరికి ఉపకారం చేయాలని, అక్కడి సర్పంచ్‌కు సహకారం అందించేలే కానీ అభివృధ్దిని అడ్డుకోవద్దని హితవు పలికారు. పది మంది ఎంపీటీసీలు ఛీ కొట్టితే ఒక్క ఎంపీటీసీకి డబ్బులిస్తే నా పదవి ఉంటదని చెప్పితే లక్ష రూపాయలు తానే ఇచ్చానని, ఆ పైసలు ఇస్తే తీసుకుని ఈనాడు పార్టీ మారి నీతులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వీళ్లంతా ప్రజల కోసం పార్టీలు మారడం లేదని, కేవలం స్వప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని, రేపు మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ ఇక్కడికే వస్తారన్నారు. ఇలాంటి నాయకుల గురించి ప్రజలు ఆలోచన చేయాలని ఊరికి కలంకం తెచ్చే నాయకులను ఊరి బయటనుంచే వెళ్లగొట్టాలన్నారు. లీడర్‌ అంటే ఆదర్శంగా ఉండాలని, దాసరి లక్ష్మి లాంటి దళిత బిడ్డకు లక్షలు ఇస్తామని తిరిగితే లక్షలు వద్దని తన వెంటే తిరుగుతుందని, ఇది లీడర్‌ లక్షణమని, కులం కాదు గుణం గొప్పదని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. తనతో పాటు తిరిగే నాయకులకు సైతం పదవులు ఉండాలని గౌరవంగా ఉండాలని ఆలోచన చేస్తానని, సురేష్‌లాంటి ఎస్సీ బిడ్డను పక్కకు పెట్టుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఎస్సీ బీసీలు ఎదిగితే ఓర్చుకోలేని వాళ్లు ప్రజలకు ఏం మంచిచేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్నం పెట్టిన కంచంలో మన్ను పోసిన చరిత్ర కల్గిన నాయకుల గురించి కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేయాలని, ఈనాడు ఇక్కడ ద్రోహం చేయనోళ్లు రేపు అక్కడ ద్రోహం చేయరని గ్యారేంటీ ఏంటన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఏ రాజకీయ చరిత్ర లేకున్నా మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగానన్నారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే గొల్లపల్లి నుంచి ముకునూరు వరకు అభివృధ్దిపనులు చేయని గ్రామం లేదని, నా సాయం అందని కుటుంబం లేదన్నారు. పోతారం, విలోచవరం, ఉప్పట్లలాంటి గ్రామాల ప్రజలు అనేక ఏండ్లు గంగ రోడ్డు కోసం ఎదురుచూశారని, ఆనాడు ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రిగా ఉన్న సమయంలో గంగ రోడ్డు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఊర్లకు గంగ రోడ్డు వేయించానని, గ్రామాల్లో బురదరోడ్డు లేకుండా సీసీ రోడ్లు వేయించానని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆనాడు ముకునూరు, నీలంపల్లి గ్రామాలకు చెందిన ఆడబిడ్డలు ప్రసవం కోసం పెద్దంపేట వాగు దాటలేక అక్కడే ప్రసవిస్తే బిడ్డ బొడ్డు పేగును బండరాళ్లతో కొట్టి తెంపిన సందర్బాలు ఉన్నారని, ఆడబిడ్డల కాన్పు కష్టాలు పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్‌ పాలకులదేనన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పెద్దంపేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేసి ఆడబిడ్డల కాన్పు కష్టాలు తీర్చానని, అలాగే అనేక వాగులపై వంతెన నిర్మాణాలు చేసి రాకపోకలు మెరుగుపర్చామన్నారు. ఈనాడు ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌ నాయకులు కేవలం ఆరు పథకాలు చెప్తున్నారే కానీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏంచేస్తాడో చెప్పడం లేదని, ఐదేండ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క అడబిడ్డ పెండ్లికి, పేదబిడ్డ చదువుకు సాయంచేయలేదని, ఈనాడు ఎన్నికలు రాంగానే ఓట్ల కోసం గడియారాలు, చీరలు పంచుతున్నారని అన్నారు. మనల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప మన గురించి ఆనాడే ఆలోచన చేయలేదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృధ్ది, పనులతో పాటు గొప్ప పథకాలు అమలు చేస్తున్నారని, తొమ్మిదేండ్లలో అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తగా అమలు చేసే పథకాలు, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసే సేవలను బాజాప్తా చెప్తున్నానని అన్నారు.

ఎమ్మెల్యేగా ఎంతోమంది బీద ఆడబిడ్డల పెండ్లిళ్లు, పేద విద్యార్ధులకు చదువులు, ఆస్పత్రుల్లో వైద్యం చేయించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే పించన్‌లు, రైతుబంధు పెంపు, సౌభాగ్యలక్ష్మిపేరిట ప్రతి మహిళకు మూడు వేలు, రైతుబీమా తరహాలో కేసీఆర్‌ ఐదు లక్షల బీమా, నాలుగు వందలకే గ్యాస్‌సిలిండర్‌ అందించడం జరుగుతుందని, ఈ పథకాలతో పాటు ప్రతి ఏటా పేదింటి ఆడబిడ్డలకు ట్రస్టు ద్వారా పెండ్లిళ్లు, పేద విద్యార్ధులకు హైదరాబాద్‌లో రెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత చదువులు చదివించే బాధ్యత తనదేన్నారు. అంతేకాకుండా గృహలక్ష్మిపథకం ద్వారా పేద కుటుంబాలకు ఇండ్లు మంజూరీ చేయించి ఆ ఇంటి నిర్మాణంతో తనవంతు సాయం చేసి దగ్గరుండి ఇంటి నిర్మాణం చేయిస్తానని హమీ ఇచ్చారు. ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీసేవకుడిగా పనిచేస్తానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!