Saturday, July 27, 2024
Homeతెలంగాణమహానీయుల స్పూర్తితో ఓటు ద్వారా సేవకుడినే నాయకుడిగా ఎన్నుకోవాలి

మహానీయుల స్పూర్తితో ఓటు ద్వారా సేవకుడినే నాయకుడిగా ఎన్నుకోవాలి

మహానీయుల స్పూర్తితో ఓటు ద్వారా సేవకుడినే నాయకుడిగా ఎన్నుకోవాలి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్  

మంథని,సెప్టెంబర్‌ 10( కలం శ్రీ న్యూస్) :చాకలి ఐలమ్మ, జ్యోతిబాపూలే,సర్థార్‌ సర్వాయి పాపన్నలతో పాటు చరిత్రలో మహానీయులుగా నిలిచిన వారందరి స్ఫూర్తితో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగపు హక్కు ఓటు అనే ఆయుధంతో సేవకుడినే నాయకుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు ఆలోచించి ముందడుగు వేయాలని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కోరారు. వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్థంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌,మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ,చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రంలతో పాటు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్థంతి సభలో పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ తనపై ధౌర్జన్యానికి దిగిన దోరకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మంథనిలో తొలుత ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ తరువాత ఎందరో మహానీయుల విగ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను,వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించడానికి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కృషి చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మంథనిలో గత పాలకులు మహానీయుల విగ్రహాలను, చరిత్రను బడుగు,బలహీన వర్గాల ప్రజలకు తెలియనివ్వకుండా వారి తండ్రి విగ్రహాలను పెట్టి వారికే మొక్కాలని ప్రజలకు సూచించడం బాధకలిగించిందన్నారు. మహానీయుల స్ఫూర్తితో బడుగు, బలహీనవర్గాల ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న తనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చలోక్తులు పేల్చడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఎందరో మహానుభావులు ఉద్భవించిన బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఐక్యం చేస్తూ బజనవాదంతో రాజకీయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. బజనులంతా చైతన్యవంతులై తమ ఓటు హక్కు ద్వారా ప్రజలకు సేవ చేసే,వారి సంక్షేమ అభివృద్ధిని కాంక్షించే నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. దేవుళ్లు వచ్చి మన కష్టాలను తీర్చరని..ఆ దేవుడే మనిషి రూపంలో సేవ చేసే వారిని పంపిస్తాడని.. అలాంటి వారిని మనం గుర్తించి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. బడుగు, బలహీనవర్గాల బిడ్డగా మంథనిలో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సామూహిక వివాహాలు, ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో, స్టడీ సెంటర్ల వద్ద ఉచిత భోజన వసతి సదుపాయం, ముక్తి ఆశ్రమమ్‌, విశ్రాంతి భవనంలతో పాటు తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని.. అందుకే మంథనిలోనే ఇల్లు కట్టుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తమ తరువాత తమ కుటుంబం నుంచి ఎవరు రాజకీయంగా పోటీ చేయరని.. ఇక్కడి మట్టి బిడ్డలే రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. మన తలరాతలను మార్చే శక్తి ఉన్న ఓటు అనే ఆయుధానికి నేటికి కొంత మంది సద్వినియోగం చేసుకోక పోవడం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికే ఎందరో మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని తాజాగా మంథని అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ సర్పంచ్‌ ముక్కా వీరరాఘవులు, మంథని తొలి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు, తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ఖలాం విగ్రహాలను కూడా త్వరలోనే మంథనిలో నెలకొల్పుతామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పోరాట స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఉద్యమ కాలంలో సీఎం కేసీఆర్‌ తీయని రోజు లేదని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఆమె ప్రస్థావన తేవడంతో పాటు ప్రతీ ఏడాది జయంతి,వర్థంతి వేడుకలను ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు.చాకలి ఐలమ్మ ఖ్యాతి మన తెలంగాణకే కాకుండా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా వ్యాపించి రాజధానిగా ఉన్న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సెంటర్‌లో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆనంతరం ఎస్ఐలు రాణి, దివ్య, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు లింగం ఆంజలితో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురినీ పూల మాల శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఆనంతరం పుట్ట మధూకర్‌ రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.చాకలి ఐలమ్మ వర్థంతి నిర్వాహణ కమిటీ కన్వీనర్‌ పోతరాజు సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్‌ ఎక్కటి ఆనంతరెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, కౌన్సిలర్లు వీకే.రవి, గరెపల్లి సత్యనారాయణ, రజక సంఘం నాయకులు కొల్లూరి సమ్మయ్య, రాజయ్య, పైడాకుల నాగరాజు, పోతరాజు శ్రీనివాస్లతో పాటు రజక సంఘం నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!