Saturday, July 27, 2024
Homeతెలంగాణపుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అభినందన సభ..

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అభినందన సభ..

పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అభినందన సభ..

మంథని మే 13(కలం శ్రీ న్యూస్):స్వాతంత్య్రం వచ్చిన 76ఏండ్లలో అగ్రబాగాన పరిపాలన చేసిన దుద్దిళ్ల కుటుంబం ఆనాడు మన గురించి ఆలోచన చేసి ఉంటే ఈనాడు మన బిడ్డలు ఆకలిబాధలు పడేవారా అని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ ప్రశ్నించారు.ఇటీవల విడుదలైన ఇంటర్‌,పదోతరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్దులకు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులను ఘనంగా సన్మానించి మెమోంటులు అందజేశారు.మంథనిలోని రాజగృహాలో శనివారం ఏర్పాటు చేసిన ఈ సభలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాలకు చెందిన ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్ధులను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోపేదల ఓట్లతో 40ఏండ్లు అధికారంలో ఉన్న ఒక్క కుటుంబం ఆనాడే అమెరికాకు పోయి అనందంగా ఉన్నారన్నారు. 40ఏండ్ల క్రితమే అప్పటి శ్రీపాదరావు మన గురించి ఆలోచన చేసి ఉంటే ఈనాడు మనం,మన బిడ్డలు గొప్పగా చదువుకునేవారం కాదా అని ఆయన ప్రశ్నించారు.ఏనాడు మన కష్టాలు,కన్నీళ్లు పట్టించుకోని కుటుంబానికి ఓట్లు వేసి పట్టం కట్టామని ఆయన దుయ్యబట్టారు. ఆనాడు గొప్పగా ఆలోచన చేసిన బీఆర్‌ఎస్‌ అంబేద్కర్‌ అట్టడుగు వర్గాలకు ఒక ఆయుధంగా ఓటు హక్కును అందించారని, ఓటు హక్కుతో మంచినాయకుడిని ఎన్నుకోవాలన్నదే అంబేద్కర్‌ ఆశయమన్నారు.కానీ మనం మన గురించి పట్టించుకోని వారికే 40ఏండ్లుగా పట్టం కట్టి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ మన గురించి మన బిడ్డల గురించి గొప్పగా ఆలోచన చేశారన్నారు.కార్పోరేట్‌ విద్యా సంస్థల్లో లక్షలు వెచ్చించి చదవించుకునే స్థోమత లేని పేదలకు కార్పోరేట్‌ స్థాయిలో విద్యను అందించాలని ఆలోచన చేసి అనేక గురుకుల, మైనార్టీ పాఠశాలలను నెలకొల్పారన్నారు. అంతేకాకుండా మన ఊరు మన బడి కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించి పేదబిడ్డల ఉన్నత చదువులకు చేయూతనిచ్చారని ఆయన గుర్తు చేశారు.ఈనాడు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుని పేద బిడ్డలే మెరిట్‌ సాధించారని, మన బిడ్డలు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ఎనాడు మన బిడ్డల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయని దుద్దిళ్ల కుటుంబం ఈనాడు మెరిట్‌ సాధించిన విద్యార్దుల వద్దకు వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మెరిట్‌ విద్యార్దులను అభినందించడం తప్పు కాదని, కానీ ఏనాడు ఆ బిడ్డల గురించి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. మెరిట్‌ స్టూడెంట్‌ వద్దకు వెళ్లి ఫోటోలు దిగే ముందు ఆలోచన చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులకు హితవు చెప్పారు. మన ఓట్లతో గెలిచి నాలుగేండ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఈనాడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏనాడైనా మన బిడ్డల చదువుల గురించి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే అక్కడ బిజీగా ఉంటే ఇక్కడ ఆయన సోదరుడు ఫోటోలకు ఫోజులిస్తున్నాడని,ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు.నెలకు రూ.2.75లక్షల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యే నాలుగు రూపాయలు ఖర్చు చేసి ఏ సాయమైనా చేశాడా అని ఆలోచన చేయాలన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తాము బీదింటి బిడ్డల భవిష్యత్‌ కోసం ఆరాటపడుతూనే ఉన్నామని, ఎక్కడ అవకాశం వచ్చినా సాయం అందిస్తూనే ఉన్నామన్నారు. ఆకలి తీర్చాలని కళాశాల విద్యార్దులు కోరిన వెంటనే మధ్యాహ్న బోజనం అందించామని, విద్యార్దుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే దిశగా మోటివేషన్‌ క్లాసులు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. పేద విద్యార్దుల ఉన్నత చదువులను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తామని, మేనమామ పాత్రలో పేద విద్యార్దుల చదువులకు అండగా నిలుస్తానని హమీ ఇచ్చారు.తల్లిదండ్రులకు పిల్లల చదువులు బారం కావద్దన్నదే తమ ఆలోచన అని,ఆ బారాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.రాబోయే రోజుల్లో పేద విద్యార్దుల ఉన్నత చదువులకు తమవంతు సహకారం అందిస్తామని ఆయన ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. అనంతరం మెరిట్‌ సాధించిన విద్యార్దులకు మెమోంట్‌లు అందజేసి శాలువాతో ఘనంగా సన్మించారు. అలాగే విద్యార్దులతో కలిసి సహపంక్తి బోజనం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!