మంథని లో ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవాలు
మంథని ఏప్రిల్ 25(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని శ్రీ శిలేశ్వర సిద్దేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవములు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా 1968 లో లోకే గారి పెదరామన్న శ్రీ ఆదిశంకరాచార్యుల విగ్రహం ప్రతిష్టించారు. ఆయన 1960లో సన్యాసం తీసుకున్నానంతరం పూర్తిగా దైవ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవములు మొదటిసారిగా ఈ ఆలయంలో లోకే పెద్ద రామన్న మనుమలు లోకే సుధాకర్ రాధాకృష్ణ మనోహర్ శరత్ (శ్రీధర్) లు నిర్వహించ తల పెట్టారు. అనాదిగా ఈ ఆలయంలో శ్రీ శిలేశ్వర సిద్దేశ్వర స్వాముల వారితో పాటు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారికి కూడా ప్రతినిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సోమవారం శ్రీ శంకరాచార్యుల జయంతిని పురస్కరించుకొని ఉదయం, ధర్మ జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించి ప్రాతఃకాల,వేద పఠనం గురువందనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సాయంకాల పూజ,గురు వందనము, రాజోపచారములు, అన్నదాన వితరణ వంటి కార్యక్రమాల లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం శంకరాచార్య ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కోలాటం చేస్తూ భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో తన్మయం చెందారు.