ఎలుకల మందు తాగి బెల్ట్ షాప్ నిర్వాహకుడి ఆత్మహత్య యత్నం
సుల్తానాబాద్,జులై23(కలం శ్రీ న్యూస్):
మద్యం దుకాణాల సిండికేట్ నిర్వాహకులు తనను వేధిస్తున్నారంటూ ఓ బెల్ట్ షాప్ యజమాని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.వివరాలలోకి వెళితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ కు చెందిన కీస సంతోష్ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు.
కాగా సుల్తానాబాద్ మండలంలో మద్యం దుకాణదారులు నాలుగురోజుల క్రితం సిండికేట్ అయి బెల్ట్ షాప్ నిర్వాహకులకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారని దీంతో తాను కూడా ఎక్కువ రేట్లకు అమ్మాల్సి వస్తుందని సంతోష్ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ మండల మద్యం సిండికేట్ యజమానులు రెండు రోజులుగా తనకు మద్యాన్ని ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని,దీనితో మనస్తాపంతో తన దుకాణంలోనే రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు ఆయనను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.