వ్యవసాయంపై విద్యార్థి దశ నుంచి అవగాహన ఉండాలి.
చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్
సుల్తానాబాద్,జులై16(కలం శ్రీ న్యూస్):
రైతే దేశానికి వెన్నుముక అని, దేశంలో 75 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అన్నారు. ఆహారం ఉత్పత్తికి రైతులు పడే శ్రమను ప్రత్యక్షంగా చూసేందుకు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల ఐదో తరగతి విద్యార్థులు మంగళవారం ఉపాధ్యాయులతో కలిసి పొలం బాట పట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, పుస్తకాలతో కుస్తీ పట్టి, ఆ తరగతి గదులకే పరిమితం కాకుండా, వ్యవసాయ జీవనం, తమ ప్రాంతంలో పండే పంటలను విద్యార్థులకు వివరించడానికి, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడానికి పంట పొలాలకి తీసుకెళ్లామని, ఈ రోజుల్లో పిల్లలకు వ్యవసాయం పట్ల అవగాహన లేకుండా పోతుందని, పిల్లలకు ప్రత్యక్షంగా వరి నాటు వేసే విధానాన్ని చూపించడానికి తీసుకొని రావడం జరిగిందని అన్నారు. వ్యవసాయంపై విద్యార్థి దశ నుంచి అవగాహన ఉండాలని అన్నారు. విత్తనాలు చల్లి వరి నాటు నుండి పంట చేతికి ఎలా వస్తుందో విద్యార్థులకు వివరించామని అన్నారు. విద్యార్థులు పొలంలో స్వయంగా నాట్లు వేశారు. రైతులు పడే కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని క్రితిక మాట్లాడుతూ, రైతులు, మా తల్లిదండ్రులు మనం రోజు తినే అన్నం కొరకు పంట పొలాల్లో ఎలా కష్టపడుతున్నారు, మనం తినే అన్నం ఎలా వస్తుంది అనే విషయంపై మా ఐపిఎస్ స్కూల్ యాజమాన్యం నిర్వహించిన ప్రోగ్రాం వలన తెలుసుకున్నామని, స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.