మాదక ద్రవ్యాల నిర్మూలకు యువత కృషి చేయాలి
అవగాహన ర్యాలీ యువతకు సందేశం
సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి
సుల్తానాబాద్,జూన్26(కలం శ్రీ న్యూస్):
మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత కృషి చేయాలని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ఎస్సై శ్రావణ్ కుమార్ పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని, వాటిని నిర్మూలించేందుకు అందరూ సహకరించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో అనేకమంది యువత డ్రగ్స్ సేవించి చెడు మార్గం పడుతున్నారని అన్నారు. యువత, విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా యువత డ్రగ్స్ మాయలో పడి తమ విలువైన జీవితాన్ని వృథా చేసుకోకూడదని ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. యువత మత్తుపదార్ధాలకు అలవాటు పడితె వెంటనే దూరంగా ఉండేలా కృషి చేయడం మన బాధ్యత అన్నారు. గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం, వ్యక్తులు తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల అత్యాచార యత్నాల వంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. స్కూల్స్, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణా,సరఫరా. విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని, ఒక్కసారి కేసు నమోదు ఐనట్లయితే విద్యార్థిని, విద్యార్థులు యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక భవిష్యత్తు అంధకారమైపోతుందని సూచించారు. అనంతరం డ్రగ్స్ పై నిర్వహించిన వ్యాసరచనము లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందించారు. అనంతరం మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల తో పాటు విద్యార్థినిలు పలువురు పాల్గొన్నారు.